ఇంట్లో నుండి పొరపాటున తప్పిపోయిన చిన్నారులు, కిడ్నాప్ అయిన పిల్లలను కాపాడటం...
ఆకలితో ఉన్న వాడికి అన్నం పెడితే అతని ఆకలి అప్పటి వరకు మాత్రమే తీరుతుంది. పేద వాడికి చేసిన డబ్బు సాయం యెల్ల కాలం అతన్ని కాపాడుతుందని మనం గ్యారెంటీ ఇవ్వగలమా? కానీ, మనం ఇచ్చే ఒక్క సమాచారం భావి భారత పౌరులుగా అమూల్య భవిష్యత్తు ఉన్న చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలనుండి వారి లేలేత జీవితాల్ని కాపాడుతుంది. అవును ! ఇది నిజం. .
గత కొన్ని రోజులుగా నిరంతరం చెన్నై నగరంలో జరుగుతున్న వరుస కిడ్నాప్ ఉదంతాలు తల్లిదండ్రుల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అక్కడ రోజుకు ఇద్దరు చిన్నారులు గల్లంతవుతున్నారు. ఇటీవల చెన్నైలో రోడ్డు పక్కన నడుస్తున్న చిన్నారిని కారులో ఎత్తుకెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజీ యావత్ భారత దేశాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక్క చెన్నై నగరంలోనే కాదు. భారతావని అంతటా ఇలాంటి సంఘటనలు వేల సంఖ్యలో జరుగుతుండటం విచారకరం. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం..
ప్రతీ సంవత్సరం లక్షా యాభై వేల చిన్నారులు తప్పి పోతున్నారని అందులో కనీసం సగం మంది పిల్లల ఆచూకీ కూడా లభించడం లేదని నివేదికలో పేర్కొంది. కేస్ ఫైల్ అయిన కేసులే ఇవైతే కానివెన్నో?
ఇంట్లో నుండి దురదృష్టవశాత్తు తప్పిపోయిన చిన్నారులను అపరిచిత వ్యక్తులు ఎత్తుకెళ్ళి వారి అవయవాల కోసం క్రిమనల్ గ్యాంగ్లకు అమ్మడంతో పాటు, అక్రమంగా దత్తతలు తీసుకునే కుటుంబాలకు విక్రయిస్తూ , విదేశాలకు పంపిస్తూ, వేశ్యా గృహాలకు అమ్మి వేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. అలాగే, వెట్టి చాకిరీ, భిక్షాటన తదితర విధాలుగా వారి బాల్యాన్ని ఛిద్రం చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిషన్ వెల్లడించింది. పిల్లల ఆచూకీ పట్టుకోవడానికి రెండు రోజులు ఆలస్యమైనా
పిల్లలను దేశం దాటించే అవకాశాలుంటాయని కమిషన్ పేర్కొందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవక మానదు.
కన్న తల్లి పెట్టే
గోరు ముద్దలు తింటూ, తండ్రి చెప్పే చందమామ కథలు వింటూ అపురూపంగా పెరిగే బాల్యాన్ని దూరం చేసుకొని, కిడ్నాపర్ల చేతిలో చిత్ర హింసలతో మనసులు, శరీరాలు గాయపరుచుకుంటున్న ఆ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపి, బిడ్డను కోల్పోయి గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ కన్న తల్లిదండ్రులను ఓదార్చే బాధ్యత మనందరిపై ఉందన్నది కాదనలేని సత్యం.
ఇప్పటికే చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్, చైల్డ్ రైట్స్ చారిటీ తదితర స్వచ్ఛంద సంస్థలు కనిపించకుండాపోయిన పిల్లలను వెతికేందుకు కృషి చేస్తున్నాయి. మనం కూడా తప్పిపోయిన
పాపాయి కి జన్మనివ్వకపోయినా వాళ్ళను కాపాడి వారికి పునర్జన్మనిద్దాం. ఇందుకు గాను, ఇంట్లో నుండి పొరపాటున
తప్పిపోయిన చిన్నారుల వివరాలను చైల్డ్ లైన్ ఇండియా ఫౌండేషన్,
చైల్డ్ రైట్స్ చారిటీ, ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖలు మొదలగు సంస్థలకు అందించి, రాక్షస ముఠాల కంట వారు పడకుండా ఆ పాల నురుగు పాపాయిల మోము పై చిరునవ్వులను పూయించేలా నడుముకడుదాం పదండి.
For telugu news
online
please Download NewsDistill app from Google play store
No comments:
Post a Comment