భక్తజనులు ఉత్సుకతతో ఎదురుచూస్తున్న కృష్ణానది పుష్కర సంరంభం రానేవచ్చింది. తెలంగాణ, నవ్యాంద్ర ఆవిర్భావం తర్వాత వస్తున్న మొదటి కృష్ణా పుష్కరాలు కావటంతో దీని నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి అవాంచనీయ ఘటనలు
జరగకుండా లైవ్
న్యూస్ కవరేజ్
ద్వారా భద్రతా సిబ్బంది పుష్కరాలను క్షణం క్షణం పరీక్షిస్తుండటం విశేషం.
భారతీయ సంస్కృతిలో నదులు దేవతా మూర్తులుగా పూజలందుకుంటున్నాయి. నదులు పవిత్రమూర్తులని వేదకాలం నుంచి చెబుతున్నారు. అలాంటి పవిత్ర నదుల్లో కృష్ణానది ఒకటి. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఏపీ ప్రజలు తలచుకుని తరించవలసిన తల్లి. ఆ చల్లని తల్లి ఒడిలో బతుకుతున్నాం. సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తులో జన్మించిన కృష్ణమ్మ బిరబిరా ఉరకలెత్తిన ప్రాంతం పాడిపంటలతో కళకళలాడుతోంది. ఇప్పుడు ఆ నదీమాతల్లికి పూజోత్సవం ఎంతో దేదీప్యమానంగా వెలగడం అందరిలో ఆనంద వెల్లువలను కురిపిస్తుంది. ఇప్పుడు ఏ నోట విన్నా కృష్ణమ్మ వార్తలే బ్రేకింగ్ న్యూస్ గా అందరి గడపలను తడుతున్నాయి.
ఇప్పుడే ఆ నదులకు మహత్తు ఎందుకు ? :
నదీ జలాలు పుష్కర సమయాల్లో అదిదైవిక తేజస్సును కలిగి ఉంటాయని ప్రతీతి. ఆ సమయాల్లో మానవులు స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్టానాలను,పితృపిండ ప్రదానాలను చేయాలని మహర్షులు ప్రబోధించారు. ఈ కర్మల వలన శారీరక, మానసిక, బౌద్దిక కల్మషాలు తొలగి మానవులు పవిత్రులు, తేజోవంతులై ఉత్తేజితులవుతారని పండితులు చెబుతున్నారు.
పుష్కర సమయాల్లో నదులకు మహత్తు రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. పురాణకాలంలో తుందిలుడనే మహర్షి పరమేశ్వరుడిని తపస్సు చేసి శాశ్వతంగా అతనితో ఉండే వరం పొందుతాడు. ఈశ్వరుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జల రూపంలో అతనికి శాశ్వత స్థానమిచ్చాడు. జలసామ్రాజ్యానికి సార్వభౌముడుగా కూడా ఆ పుష్కరుడు వరం పొందాడు. అనంతర కాలంలో బ్రహ్మకు జగత్తుని సృష్టించడానికి జలం అవసరమవగా, ఈశ్వరుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు తన కమండలంలో పుష్కరుడు నివాసముండేటట్లు వరం పొందాడు. ఆ తర్వాత ప్రాణులను బతికించే ధర్మం తనది కాబట్టి, జీవనాధారుడైన పుష్కరుని తన ఆధీనంలో ఉంచవలసిందిగా బృహస్పతి బ్రహ్మను వేడుకుంటాడు. అయితే పుష్కరుడికి బ్రహ్మను విడిచి వెళ్లలేక, బ్రహ్మను కూడా తనతో పాటు బృహస్పతి వద్ద ఉండాల్సిందిగా ప్రార్థిస్తాడు. ఇది అసాధ్యమవడంతో బ్రహ్మ మధ్యేమార్గంగా ఒక ఏర్పాటు చేశాడు. గ్రహస్వరూపుడైన బృహస్పతి ద్వాదశ రాశులందు ప్రవేశించేటప్పుడు 12 రోజులు, ఆయా రాశుల నుంచి నిష్క్రమించేటప్పుడు 12 రోజులు,సంవత్సరంలో మిగిలిన అన్ని రోజుల్లో మధ్యాహ్న సమయంలో రెండు ముహూర్తాల కాలం పుష్కరుడు బృహస్పతితో ఉండాలని, ఆ స మయాల్లో తాను సమస్త దేవతలతో బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన పుణ్యనదికి వస్తూ ఉంటానని చెప్పా డు. దీంతో అప్పటి నుంచి బృహస్పతి ఒక్కోరాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కర సంబరం వస్తుంది.
కృష్ణమ్మ రావి, ఉసిరి చెట్ల నుండి పుట్టిందంట!
రావి, ఉసిరి చెట్ల నుంచి కృష్ణవేణి ఆవిర్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. భూలోకవాసులను పాప విముక్తుల్ని చేయడానికి ఉపాయం చెప్పమని బ్రహ్మాది దేవతలు మహావిష్ణువును ప్రార్థించారు. ఆయన వారందరినీ పరమేశ్వరుడి వద్దకు తీసుకెళ్లి విషయాన్ని వివరించారు. త్రినేత్రుడు వారికి తరుణో పాయం తెలిపాడు. పడమటి కనుమల్లోని సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో బ్రహ్మగిరి వేదగిరి శిఖరాల్లో నీవు (శ్రీ మహావిష్ణువు) అశ్వత్థ (రావిచెట్టు) వృక్షంగా, నేను (శివుడు) అమలక (పెద్ద ఉసిరిక)గా వెలుస్తామని చెప్పారు. మన అంశలతో కృష్ణ-వేణి నదులు ఆవిర్భంచి, ఒకటిగా తూర్పు దిశగా ప్రవహించి బంగాళఖాతంలో కలుస్తాయని తెలిపారు. కాల క్రమంలో బ్రహ్మాగిరిలో మహావిష్ణువు రావిచెట్టుగా మారి ఆ వేళ్ల కింద నుంచి వస్తున్న నీరు కృష్ణ అయింది. ఈశ్వరుడు వేదగిరిలో ఉసిరిచెట్టుగా వెయగా, ఆ వేళ్ల కింద నుంచి వచ్చిన నీరు వేణిగా మారింది. అలా కృష్ణవేణి ఆవిర్భవించింది.
విశేషాల కృష్ణవేణి :
జీవరాశికి అమృత తుల్యమైన జలప్రసాదాన్ని అందిస్తున్న కృష్ణమ్మ పుట్టిల్లు మహారాష్ట్రలోని మహాబలేశ్వరం. పడమటి కనుమల్లో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ధారగా ఆవిర్భ వించింది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ దాటి ఆంధ్రప్రదేశ్లో శ్రీశైల మల్లికార్జుని సేవించి, అమలింగేశ్వరుడిని అభిషేకించి, దుర్గమ్మను తాకి హంసలదీవి వద్ద సాగరుడిలో కలుస్తుంది. కృష్ణా నది పరి వాహక ప్రాంతం 2.56 లక్షల చదరపు కిలోమీటర్లు. మహారాష్ట్రతోపాటు కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. ఉప నదులన్నీ కలుపుకుంటే నది వ్యవస్థ పరివాహక ప్రాంతం 2,56,000 చదరపు కిలోమీటర్లు, మహారాష్ట్ర 26.8, కర్ణాటక 43.8,తెలుగురాష్ట్రాలు 29.4 శాతం ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి.
No comments:
Post a Comment