జంక్షన్లో సిగ్నల్ పడింది మొదలు . . ‘ట్రాఫిక్’కు అడ్డం పడుతు మరీ.. బిక్షాటన చేసే పిల్లలను ఒక్కసారి తెరిపారా చూస్తే, ‘యాచక వృత్తిలోకి దిగుతున్న ఈ పసివాళ్లంతా ఎక్కడి నుంచి వస్తున్నారు..?’ అనే సందేహం కలగక మానదు. పెద్ద సంఖ్యలో పిల్లలను బలవంతంగా యాచక వృత్తిలోకి దింపుతున్న ముఠాల ఆగడాల వల్లే వీరి బాల్యం చిద్రమవుతుందన్న సంగతి అప్పుడు గానీ బోదపడదు. ఒక్క యాచక వృత్తే కాదు. ఇంట్లో నుండి దురదృష్టవశాత్తు తప్పిపోయిన చిన్నారులను అపహరించి వారి అవయవాల కోసం క్రిమినల్ గ్యాంగ్లకు అమ్మడం, అక్రమంగా దత్తతలు తీసుకునే కుటుంబాలకు పసి మొగ్గల్ని విక్రయించడం, విదేశాల్లో లేదా స్వదేశంలోనే వేశ్యా గృహాలకు అమ్మి వేస్తూ డబ్బులు దండుకోవడం వంటి హీనాతిహీన కార్యాలను అపరిచిత వ్యక్తులు/ ముఠాలు చేస్తున్నాయి . అంతటితో ఆగకుండాఅనేక విధాలుగా పిల్లల్ని హింసిస్తూ మెడికల్ పరీక్షలకు బలిపశువులుగా ఉపయోగించడం, ఇళ్ళల్లో వెట్టి చాకిరీ చేయించడమో, పరిశ్రమలలో బాల కార్మికులుగానో చేస్తూ ఆ పాలనురుగులు చిందాల్సిన మోములపై కన్నీటిదారలను కార్పిస్తున్నారు.
ఇటీవల చెన్నైలో రోడ్డు పక్కన నడుస్తున్న చిన్నారిని దుండగులు కారులో ఎత్తుకెళ్ళుతున్న సీసీటీవీ ఫుటేజీ దృశ్యాలు యావత్ భారత దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ వార్త బ్రేకింగ్
న్యూస్ లా దేశమంతా వ్యాపించింది. ఒక్క చెన్నై నగరంలోనే కాదు. యావత్ భారతావని అంతటా ఇలాంటి సంఘటనలు తరుచూ జరుగుతుండటం విచారకరం. దేశం మొత్తమీద ఏటా సుమారు 30 వేలకు పైగానే బాలలు అదృశ్యం అవుతున్నట్లు ఎన్సిఆర్బి ( నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో (జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ) – భారత ప్రభుత్వం ) లెక్కలు స్పష్టం చేస్తున్నా.. ఆ సంఖ్య వాస్తవ దూరమని స్వచ్చంద సంస్థల లేటెస్ట్
అప్డేట్స్ నిగ్గుతెలుస్తున్నాయి. స్వచ్చంద సంస్థల సర్వేలను నిజం చేస్తూ.. సాక్షాత్తు, హోం మంత్రిత్వ శాఖ వారు 2014 పార్లమెంట్ సమావేశాల్లో ‘ దేశంలో ఏటా కనీసం లక్షమంది చిన్నారులు కనిపించకుండా పోతున్నా’రని చెప్పడం వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతుంది. సగటున ప్రతి రోజూ కనీసం రెండొందలకు పైగా పిల్లలు జాడ లేకుండా పోతున్నారని హోం శాఖ వారు నివేదించారు. ఒక్క నేవీ ముంబయిలోనే ఏటా సుమారు వెయ్యి మంది చిన్నారులు అదృశ్యం అవుతున్నారంటే పరిస్థితి ఎంత భీకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అస్సాం వంటి చిన్న రాష్ట్రంలో సైతం ఏటా దాదాపు నాలుగువేల మంది పిల్లలు కనిపించకుండాపోతున్నారు.
వాస్తవ ముఖ చిత్రం :
నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో వారు చెబుతున్న లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 2012లో 18,266 మంది చిన్నారుల జాడ తెలియకుండా పోగా, 2013 లో అపహరణ / తప్పిపోయిన చిన్నారుల సంఖ్య 28,167 గా ఉంది. 2014 కి తప్పిపోయిన/ అపహరణకు గురైన చిన్నారుల సంఖ్య 37,854గా తేలిందని సదరు సంస్థ నివేదికను ఇచ్చింది. ఈ గణాంకాలు కేవలం కేసు ఫైల్ అయిన చిన్నారులవి మాత్రమే! అయితే, లేటెస్ట్
న్యూస్ ప్రకారం మిస్ అవుతున్న చిన్నారుల కేసులన్నీ ఫైల్ అవకపోవడం విషాదకరం . ఈ లెక్కన సగటున సంవత్సరానికి లక్షకు పైగా చిన్నారులు తప్పిపోవడము/ అపహరణల్లో చిక్కుకోవడము జరుగుతుంది. ఇక ఢిల్లీ,ముంబయి, కోల్కత, పూణె, హైదరాబాద్, పాట్నా వంటి అనేక నగరాల్లో పిల్లలను అపహరించి, వారిచేత యాచన చేయించే ముఠాలు డజనుకు పైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చిన్నారుల అపహరణలకు సంబంధించిన కేసుల్లో పోలీసులు నిర్ధిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు గతంలోనే పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యేటికేడూ తప్పిపోయిన చిన్నారుల్లో సగం మంది ఆచూకీ కూడా లభించకపోవడం చూస్తే, పోలీసులు కిడ్నాప్ అవుతున్న చిన్నారుల రక్షణ చర్యలకు తీసుకుంటున్న నిర్ధిష్టమైన ప్రణాళికల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని ప్రస్పుటమవుతుంది .. కొన్ని కేసుల్లో మాత్రమే పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయడం తప్ప, గ్రామీణ ప్రాంతాలు, బడుగువర్గాలకు చెందిన పిల్లల విషయంలో అతీగతీ కనిపించడం లేదనేది కాదనలేని సత్యం. దేశవ్యాప్తంగా ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక బాలుడు /బాలిక అదృశ్యం అవుతున్నట్లు స్వచ్చంద సంస్థలు తేల్చాయి. పిల్లల అదృశ్యం కేసులు ఏటేటా పేరుకుపోతుండగా, సగటున పాతిక శాతం కేసుల్లో మాత్రమే ఫలితాలు కనబడుతుండటాన్ని చూస్తే పిల్లల అపహరణ విషయంలో విచారణ ప్రక్రియ ఎంత నత్తనడకన సాగుతుందో తెలుస్తుంది అన్నింట్లో వారే ..!
అదృశ్యం అవుతున్న పిల్లల్లో బాలికల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళనను కలిగజేస్తున్న అంశం. పిల్లలను అపహరించే ముఠాలు అనేక చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ముక్కు పచ్చలారని పసి మొగ్గలని బలిచేస్తున్నాయి. పిల్లలు పుట్టింది మొదలు . . ఈ అపహరణ ప్రహసనం దశల వారీగా కొనసాగుతుండటం విచారకరం. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో భద్రత సరిగా లేకపోవడంతో అప్పుడే పుట్టిన శిశువులను అపహరించి పిల్లలు లేని దంపతులకు భారీ మొత్తాలకు కొందరు విక్రయించిన ఘటనలు అనేకం. ఇలా ఆరంభమైన వారి చర్యలు యాచక వృత్తిలోకి బలవంతంగా చిన్నారులను దించడం, అవయవ వ్యాపారులకు పిల్లల్ని విక్రయించడం, బాలికలైతే వ్యభిచార గృహాలకు తరలించడం, అయిదు నుండి పదిహేను సంవత్సరాల వయసున్న చిన్నారులను కర్మాగారాల్లో బాలకార్మికులుగా చేర్పించడం, ఇళ్లలో పనివారిగా కుదర్చడం, అత్యంత ప్రమాదకరమైన బాణసంచా, ఆయుధాల తయారీలోనూ పిల్లలను వినియోగించడంతో పాటు వివిధ జంతువులపై టెస్టింగ్ కోసం ప్రయోగించే మందులను (మెడికల్ టెస్టింగ్) పిల్లలపై ప్రయోగించే అమానుష అత్యంత విపత్కర చర్యలతో కిడ్నాపర్ల విన్యాసాలు ఉచ్ఛ స్థాయికి ఎగబాకుతున్నాయని అనేక స్వచ్చంద సంస్థలు విచారం వ్యక్తం చేస్తున్నాయి.
కట్టుదిట్టమైన చర్యలే..వారి భవితకు రక్షణ !
తప్పిపోయిన చిన్నారులు అదే ప్రాంతంలో లేదా రాష్ట్రంలో ఉంటారని చెప్పలేం. తప్పిపోయిన/ అపహరణకు గురైన చిన్నారుల కేసుల్లో నిజానిజాలను రాబట్టి,ఆచూకీ కనుగొనాలంటే వివిధ రాష్ట్రాల పోలీసులు, అధికారుల మధ్య సమన్వయం తప్పనిసరిగా ఉండాలి. అపహరణకు గురయ్యే పిల్లలకు సంబంధించి అన్ని రాష్ట్రాలూ ఒకే తరహా చట్టాలను అమలు చేస్తేనే పిల్లలను రక్షించే గురుతర బాధ్యత సఫలీకృతం అవుతుందని గమనించాలి. చిన్నారులు అదృశ్యమైనట్లు ఫిర్యాదులొస్తే కేవలం ‘మిస్సింగ్’కేసులు నమోదు చేయడం తప్ప, వివిధ రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్న దాఖలాలు తక్కువే అనడానికి తప్పిపోయిన , రక్షించబడిన చిన్నారుల సంఖ్యలలో ఉన్న వ్యత్యాసాన్ని చూస్తే తెలుస్తుంది. కిడ్నాప్ అయ్యాక, ప్రాణాలు కోల్పోయి విగత జీవులైన చిన్నారుల దేహాలు లభించాక కొన్ని కేసులు వాస్తవాలు వెలుగు చూస్తుండటం మనసులను చివుక్కుపరచక మానదు . కాగా, పిల్లల కిడ్నాప్లను ఛేదించేందుకు పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని, నిఘా వ్యవస్థను, హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఆసుపత్రుల్లో, పాఠశాల వద్ద, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో, పార్కుల్లో, ఆట స్థలాల్లో, పిల్లలు సంచరించే చోట్లు మొదలగు ప్రదేశాల్లో సిసి కెమెరాలు వంటివి ఏర్పాటు చేసి లైవ్ న్యూస్ లాగా నిఘా వ్యవస్థను మరింత పటిష్ఠం చేయాలి. ఏళ్ల తరబడి పరిష్కారం కాని కేసులపై తరచూ సమీక్షలు జరిపి, కొత్త కోణంలో దర్యాప్తులను వేగవంతం చేస్తూ, స్వచ్చంద సంస్థల సాయాన్ని తీసుకుంటే కొంతమేరకైనా పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి. వ్యభిచార కేంద్రాలు,పారిశ్రామిక ప్రాంతాల్లో తరుచూ ఆకస్మిక దాడులు జరిపి నిందితులు, సూత్రదారులపై కఠిన చర్యలను సత్వరం తీసుకుంటే ఎంతోమంది బాలబాలికల వ్యధలను వెలుగులోకి తీసుకొచ్చిన వారవుతాము. దత్తత చట్టంపై చేస్తున్న ప్రచారం అనుకున్న స్థాయిలో లేదనడానికి ప్రతీ సంవత్సరం జరుగుతున్న శిశు అక్రమ విక్రయాల తంతే సాక్ష్యం. ఇకనుండైనా దత్తత చట్టానికి తగిన ప్రచారం కల్పిస్తూనే, అక్రమంగా శిశువులను అమ్మేవారిపైనే గాకుండా కొనే వారిపై సైతం కఠిన శిక్షలు అమలుపరిస్తే సంతానం లేని దంపతులు అక్రమ పద్ధతుల్లో శిశువులను కొనుగోలు చేసేందుకు సాహసించరు.
ఇప్పటికే కనిపించకుండాపోయిన పిల్లలను వెతికేందుకు పోలీసులు, ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. తప్పిపోయిన చిన్నారుల సమాచారాన్ని పోలీసు వారికి అందించడం గానీ , ప్రభుత్వ శిశు సంక్షేమ శాఖ వారికి అప్పగించడం గాని , ప్రభుత్వ గుర్తింపు పొందిన స్వచ్చంద సంస్థల వాలంటీర్లకు చేరవేయడం గానీ చేయడం మన కనీస బాధ్యత. కన్న తల్లి పెట్టే గోరు ముద్దలు తింటూ, తండ్రి చెప్పే చందమామ కథలు వింటూ అపురూపంగా పెరిగే బాల్యాన్ని దూరం చేసుకొని, కిడ్నాపర్ల చేతిలో చిత్ర హింసలతో మనసులు, శరీరాలు గాయపరుచుకుంటున్న ఆ చిన్నారుల జీవితాల్లో వెలుగు నింపి, బిడ్డను కోల్పోయి గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ కన్న తల్లిదండ్రులను ఓదార్చే బాధ్యత సగటు పౌరులుగా మనందరిపై ఉందన్నది కాదనలేని సత్యం. ప్రభుత్వాలు సైతం బాల బాలికల అపహరణ విషయంలో గట్టి చర్యలతో ముందుకెళ్తే ఆ లేత మోములపై చిరునవ్వులను కురిపించినవారవుతారు.
గగుర్పొడిచే నిజాలు :
· పిల్లల ఆచూకీ పట్టుకోవడానికి రెండు రోజులు ఆలస్యమైనా పిల్లలను దేశం దాటించే అవకాశాలుంటాయని జాతీయ మానవ హక్కుల కమిషన్ దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది.
· దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాదు, పొరుగు దేశమైన నేపాల్ నుంచి కూడా ఏటా వేలాది మంది బాలికలను ముంబయి, కోల్కతల్లోని వ్యభిచార గృహాలకు విక్రయిస్తూ అపహరణ ముఠాలు కోట్లను దండుకోవడం విచారకరం .
· బాలల అక్రమ తరలింపు వ్యవహారం 90 శాతం మేరకు దేశీయంగా జరుగుతోంది. పది శాతం బాలల్ని విదేశాలకు తరలిస్తున్నారు.
· ఏటా అపహరణకు గురవుతున్న చిన్నారుల్లో కేవలం పాతిక శాతం కేసులను మాత్రమే పోలీసులు ఛేదించగలుగుతున్నారు.
· అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) అంచనాల మేరకు భారత్లో 12.6 మిలియన్ల కంటే ఎక్కువ మంది చిన్నారులను చట్టవ్యతిరేక పనుల్లో వినియోగిస్తున్నారు.
No comments:
Post a Comment