ఉమ్మడి ఆంద్రప్రదేశ్.. తెలంగాణా, నవ్యాంద్ర ప్రదేశ్ లుగా
విడిపోయాక విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు
బాధ్యతలు స్వీకరించి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయింది. అనేక సమస్యల మధ్య
సతమతమౌతూ, నిధుల లేమి తో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని అభివృద్ధి
పథంలో నడిపించేందుకు ఆయన ఎంతో శ్రమ పడాల్సి వస్తోంది. విభజన సమస్యలు ఇంకా అలానే
ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధులను కేంద్ర
ప్రభుత్వం ఇవ్వడం లేదు. అయినా రాష్ట్రం సొంత ఆదాయాన్ని పెంచుకుని
ముందుకు వెళ్లేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు.
రాజధాని భూ సమీ కరణ, పట్టిసీమ ద్వారా నదుల
అనుసంధానం, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా, సీఐఐ భాగస్వామ్య సదస్సు, ఫైబర్ గ్రిడ్, పారదర్శ కంగా పెన్షన్లు, ప్రజాపంపిణీ తదితర
విజయాలు తెలుగు దేశం ప్రభుత్వం సాధించిన ఘనతలుగానే చెప్పుకోవాలి. ఇందులో ముఖ్యంగా
నదుల అనుసంధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలోనే బాబు ఒకడుగు
ముందుకేసి, పట్టిసీమతో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసి, ప్రధానిని సైతం
విస్మయపరిచడం విశేషం. అయితే, అందులో ముడుపులు
ముట్టాయన్న ఆరోపణలు రావడం గమనార్హం. రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ 43 లక్షల మందికి పెన్షన్లు
ఇవ్వడం, కాపులకు వెయ్యి కోట్లు, బ్రాహ్మణులకు 65కోట్లతో కార్పొరేషన్
ఏర్పాటుచేయడం బాబుకే చెల్లింది.
అయితే, రుణమాఫీ బాబుకు రైతుల్లో
మేలు చేయకపోగా అసంతృప్తి పెంచుతోంది. రూ.50 వేల రుణాలున్న వారి
పెదవులపై చిరునవ్వులు పూయించిన బాబు, లక్షన్నర రూపాయల
రుణగ్రస్తులను మాత్రం మెప్పించలేకపోతున్నారు.ప్రతిపక్షాలకు ఇదే పెద్ద బ్రేకింగ్
న్యూస్ గా
కూడా అయింది. బాబు ఇస్తున్న నిధులు వడ్డీలకే సరిపోవడం లేదన్న విమర్శ కూడా ఉంది.
మరో మూడేళ్లలో ఈ సమస్య పరిష్కరించకపోతే రైతులు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు అనేది లేటెస్ట్
అప్డేట్ .
అయినప్పటికీ, పుట్టెడు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఇలా నడిపిస్తూ, రాజధాని నిర్మాణాన్ని
విక్రమార్కుడి దీక్షలా కొనసాగిస్తుండటం బాబుకే సాధ్యమైందని కొనియాడుతున్నవారు
కోకొల్లలు. ప్రజలిస్తున్న స్పూర్తితో నవ్యాంధ్రప్రదేశ్ ను ప్రగతి బాటపట్టించి
ఇప్పటికే దేశంలో అనేక రంగాల్లో ప్రథమ స్థానం ఆక్రమించేలా చేసి పరిపాలనాదక్షతలో ఔరా
అనిపించుకుంటున్న బాబు ప్రభుత్వం ఈ రెండేండ్లలో జరిగిన ఓటుకు నోటు, కాల్ మనీ వ్యవహారాల వంటి
సంఘటనలతో కొంత అప్రతిష్ట పాలైందనడాన్ని విస్మరించలేము. ప్రతిపక్షాలు సైతం దీనిపై
చాలా గొడవలు చేస్తూ ప్రభుత్వ తప్పులను న్యూస్
ఆన్ లైన్ లో ఉండేలా చూసుకుంటున్నారు. ఇటువంటివి పునరావృతం అవకుండా
గట్టి చర్యలు తీసుకుంటూనే, అభివృద్దికి మరిన్ని బాటలు వేస్తే త్వరలోనే నవ్యాంద్ర
స్వర్ణాంద్రమవుతుంది . ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం!
No comments:
Post a Comment